జైపూర్ : నవంబర్ 25న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల (Rajasthan polls) పోలింగ్ జరగనుండగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టోంక్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజస్ధాన్ ఎన్నికలపై యావత్ దేశంతో పాటు పాకిస్తాన్ కూడా కన్నేసి ఉంచిందని, టోంక్ స్ధానంపై లాహోర్ కూడా ఆసక్తి కనబరుస్తోందని అన్నారు. టోంక్లో కొందరు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులకు ఆశ్రయం కల్పించారని ఆరోపించారు.
టోంక్ నియోజకవర్గం నుంచి రాజస్ధాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బరిలో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలపై లాహోర్ కూడా దృష్టి సారించిందని, ఎన్నికల అనంతరం లాహోర్లో స్వీట్లు పంచుకోకుండా మనం చూడాల్సి ఉందని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల ఫలితాలపై హమాస్ వంటి ఉగ్రమూకలు కూడా ఎదురుచూస్తున్నాయని చెప్పారు.
టోంక్ నియోజకవర్గ ఇన్చార్జ్గా బీజేపీ రమేష్ బిధూరిని నియమించింది. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో కాషాయ పార్టీకి చికాకులు తప్పేలా లేవు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనూ రమేష్ బిధూరి నోటిదురుసుతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంది. బీఎస్పీ ఎంపీ కన్వర్ డానిష్ అలీపై కాషాయ పార్టీ ఎంపీ దిగజారుడు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని విపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read More :