BJP Mass resignation | హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలు ఓటేసి పక్కకు పడేయకముందే ఆ పార్టీ కార్యకర్తలే తమ నాయకులను పక్కన పడేస్తున్నారు. ధర్మశాల నుంచి రాకేశ్ చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పలు మండల శాఖల అధ్యక్షులు, వివిధ సెల్ల నాయకులు పార్టీకి మూకుమ్మడి రాజీనామ సమర్పించారు. తమ రాజీనామా లేఖలను పార్టీ హైకమాండ్కు పంపి తమ నిరసనను తెలియజేశారు.
ధర్మశాల అసెంబ్లీ టికెట్ను బీజేపీ అధిష్ఠానం రాకేశ్ చౌదరికి ఇచ్చింది. రాకేశ్ చౌదరికి ఇవ్వొద్దంటూ అంతకు ముందు నుంచే పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దాంతో వారిని సిమ్లాకు పిలిపించి బుజ్జగించి రాకేశ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పంపించారు. అయినప్పటికీ వారి ఆలోచనను మార్చుకోలేదు. తమ మాట వినని అధిష్టానం మాటను తామెందుకు వింటాం అంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. జోడమల్ సరాయి, దీపు బజార్, ధర్మశాలకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మండల శాఖల కార్యవర్గం సహా పార్టీ హైకమాండ్కు సామూహిక రాజీనామా లేఖను పంపారు. టికెట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టి ఫిరాయింపు చేసే వ్యక్తికి టికెట్ ఇవ్వొదంటూ నినాదాలు చేశారు.
మరోవైపు, ధర్మశాల టికెట్ పొందిన రాకేశ్ చౌదరి గురువారం మధ్యాహ్నం నామినేషన్ సమర్పించారు. చాముండా నుంచి ఎస్డీఎం కార్యాలయం వరకు తన అనుచరులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన వెంట జనం చాలా పలుచగా ఉండటంతో.. ఈసారి రాకేశ్ ఓటమి ఖాయమని అక్కడి ప్రజానీకం చర్చించుకున్నారు. రాకేశ్ చౌదరి నామినేషన్ ర్యాలీలో ఆయన వెంట కాంగ్రా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రభూషణ్ నాగ్, ధర్మశాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఓంకార్ నెహ్రియా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సచిన్ శర్మ, కాంగ్రా జిల్లా ఇన్ఛార్జ్ జైసింగ్ మాత్రమే ఉన్నారు.