రాయ్పూర్ : చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ)లో పాలక కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా డిసెంబర్ 29న బీజేపీ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బాధ్యులపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులకు గాయాలు కాగా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి 100 మందికి పైగా బీజేపీ నేతలు, మద్దతుదారులపై చత్తీస్ఘఢ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ చేపట్టిన నిరసనల్లో మహిళా డీఎస్పీ మెడపై గాయాలయ్యాయి. బీజేపీ సీనియర్ నేత బ్రిజ్మోహన్ అగర్వాల్, ఎంపీ రాజేష్ మునత్ సహా పలువురు ప్రముఖ నేతల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో 5000 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్ఎంసీలో అవినీతి రాజ్యమేలుతోందని, నగర పాలక సంస్ధ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలోనూ విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. నిరసనకారులు పోలీసులపై దాడి చేశారని, మహిళా పోలీసుల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేసి, కార్పొరేషన్ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారని ఆర్ఎంసీ జోన్ 4 కమిషనర్ వినయ్ మిశ్రా పేర్కొన్నారు.