న్యూఢిల్లీ : హిజాబ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కాషాయ పార్టీ నేతలు వివాదాన్ని పెంచేలా రోజుకో విద్వేష ప్రకటన చేస్తున్నారు. భవిష్యత్లో కేవలం కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లోనూ హిజాబ్ను నిషేధిస్తారని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ శుక్రవారం స్పష్టం చేశారు. యూరప్లోనూ ఇది అతిపెద్ద అంశంగా ముందుకొచ్చిందన్న సువర్ణ ఒకసారి హిజాబ్ను నిషేధిస్తే ప్రపంచానికి ఓ మంచి సందేశం పంపుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో కేవలం విద్యాసంస్ధల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లోనూ హిజాబ్ను నిషేధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా యూరప్ దేశాలు యోచిస్తున్నాయని, హిందూ రాజ్యంపై కలలు కనే మనం తొలుత దీన్ని అమలు చేయాలని అన్నారు. ఉడిపి ప్రీ యూనివర్సిటీ గర్ల్స్ కాలేజ్లో ఆరుగురు విద్యార్ధుల నిరసనతో హిజాబ్ వివాదం ముందుకు రాగా పెను సంక్షోభంలా మారి ప్రస్తుతం న్యాయస్ధానం ముంగిట ఉందని చెప్పారు.
కాగా క్లాస్రూంల్లో హిజాబ్ను అనుమతించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను గత నెలలో కర్నాటక హైకోర్టు తోసిపుచ్చుతూ హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యాసంస్ధలు నిర్ధేశించే యూనిఫాంల పట్ల విద్యార్ధులు అభ్యంతరం వెల్లడించరాదని ప్రధాన న్యాయమూర్తి రాజ్ అవస్ధి అన్నారు. తమకు హిజాబ్ ముఖ్యమైనదని తాము ఎట్టి పరిస్ధితుల్లో హిజాబ్ను విడిచిపెట్టమని, తమ న్యాయపోరాటం కొనసాగిస్తామని హైకోర్టును ఆశ్రయించిన విద్యార్ధినులు స్పష్టం చేశారు.