చెన్నై: కంపెనీ షేర్ల మ్యానిప్యులేషన్ ఆరోపణలతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లేలా చేసిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆస్తులన్నింటినీ జాతీయం చేయాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచలన డిమాండ్ చేశారు. అదానీ ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకొని వేలం వేయాలని, వచ్చిన డబ్బును అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టి నష్టపోయినవారిని ఆదుకొనేందుకు వినియోగించాలని సూచించారు. బుధవారం ఆయన పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సన్నిహితుడిగా పేరుపడ్డ గౌతమ్ అదానీ వ్యాపార అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని సుబ్రమణ్యస్వామి అన్నారు. ‘బీజేపీ తన సచ్చీలతను నిరూపించుకోవాలనేదే నా వాదన. ఈ విషయంలో ప్రధాని మోదీ ఏదో దాస్తున్నారని సాధారణ ప్రజలు అనుకొంటున్నారు. నేరస్థులను శిక్షించటం ఇప్పుడు ప్రభుత్వ కర్తవ్యం’ అని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్పై సుబ్రమణ్యస్వామి సంచలన విమర్శలు చేశారు. ‘ఇది బోగస్ బడ్జెట్. బడ్జెట్కు నాలుగు మూల స్తంభాలుండాలి. ప్రభుత్వ లక్ష్యాలేమిటి? ప్రాధాన్యతా రంగాలేమిటి? బడ్జెట్ వ్యూహం ఏమిటి? ఆదాయ మార్గాలేమి? వీటిలో ఏ ఒక్కదానినీ బడ్జెట్ ప్రతిబింబించలేదు. ఈ బడ్జెట్లో ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? నాకైతే ఏ లక్ష్యమూ కనపడలేదు. ఆర్థిక వృద్ధిరేటు 6 శాతం ఉంటుందని ఆర్థికమంత్రి చెప్పారు. ఎక్కడున్నది? గత మూడునాలుగేండ్లుగా మన వృద్ధిరేటు 3-4 శాతమే ఉన్నది. ఇప్పుడు 6 శాతం ఎలా ఉంటుంది?’ అని ఆయన ధ్వజమెత్తారు.