ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై బీజేపీ అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలు
ముంబై, మే 26: మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు కోటా కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని ఉద్దేశిస్తూ సూలే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఢిల్లీలో కొందరు ముఖ్య వ్యక్తులను కలిశారని, ఇది జరిగిన రెండురోజులకే ఓబీసీ రిజర్వేషన్ వచ్చిందని వ్యాఖ్యానించారు.
దీనిపై చౌహాన్ను అడిగినా ఆయన నుంచి సమాధానం ఏమీ లేదన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాటిల్ బుధవారం ఓ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మీరు (సూలే) ఇంకా రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికెళ్లి వంట చేసుకోండి. ఢిల్లీకి వెళ్తారో.. శ్మశానానికి వెళ్తారో మాకు తెలియదు. మాకు ఓబీసీ కోటా కావాలి. లోక్సభ ఎంపీ అయిన మీకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఎలా తీసుకోవాలో తెలియదా?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సోదరిపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని సూలే సోదరుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. బీజేపీ స్త్రీద్వేషి పార్టీ అని సూలే భర్త సదానంద్ సూలే మండిపడ్డారు. కాగా.. సూలేను, స్త్రీలను అగౌరపర్చడం తన ఉద్దేశం కాదని, గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే వ్యావహారిక భాషలో తాను మాట్లాడానే తప్ప మరో ఉద్దేశం లేదని పాటిల్ గురువారం చెప్పుకొచ్చారు.