ముంబై, ఏప్రిల్ 12: ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జడ్ క్యాటగిరీ భద్రత కలిగిన సోమయ్య ఎక్కడికి వెళ్లారో కేంద్రాన్ని అడుగుతామని మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ను మ్యూజియంగా మార్చడానికి సేవ్ విక్రాంత్ పేరుతో సేకరించిన విరాళాల్లో అక్రమాలకు పాల్పడ్డారని కిరీట్ సోమయ్య, నీల్ సోమయ్యపై కేసు నమోదైంది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ముంబై పోలీసుకు చెందిన ఆర్థిక నేరాల విభాగం వీరిద్దరికీ మంగళవారం సమన్లు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నీల్ సోమయ్య దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.