న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలను రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తిప్పికొట్టారు. బీజేపీవి అవకాశ రాజకీయాలని మండిపడ్డారు. ‘తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి చేతిలో చెయ్యివేసి నడుస్తున్నాయని ఆ రాష్ట్ర సీఎంను ప్రధాని విమర్శించారు. మరి బీజేపీ చేసిందేమిటి? పంజాబ్లో అకాలీలతో, ఏపీలో జగన్తో, హర్యానాలో చౌతాలాలతో, జమ్ముకశ్మీర్లో ముఫ్తీలతో, మహారాష్ట్రలో ఠాక్రేలతో కలిసినప్పుడు కుటుంబ పాలన గుర్తురాలేదా? వాళ్లదంతా కుటుంబపాలన కాదా? మరి వాళ్లతో బీజేపీ ఎందుకు చేతులు కలిపింది? కేసీఆర్ది కుటుంబపాలన, అవినీతి పాలన అంటున్నారు. ఆప్ది అవినీతి పాలన అంటున్నారు. అక్కడ కుటుంబ పాలన లేదు. అంటే అవినీతి పెరగటానికి కుటుంబ పాలనే ఉండాల్సిన అవసరం లేదు. బీజేపీలో కుటుంబ పాలన లేదు అంటున్నారు. అంటే బీజేపీది అవినీతి పాలన అనేనా అర్థం?’ అని ఆదివారం ట్వీట్లు చేశారు.
అసలైన పరివార్వాద్ బీజేపీదే!
నిజానికి బీజేపీలో ఉన్నంత బంధుప్రీతి ఇతర పార్టీల్లో లేదని సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ పండితులు చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు పదవుల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే వారంతా ప్రజలతో మమేకమయ్యారని తెలంగాణవాదులు గుర్తుచేస్తున్నారు. ఉద్యమ సమయంలో ముందుండి ప్రజలను చైతన్యపర్చారు. ఆ క్రమంలో జైళ్లకెళ్లారు.. పోలీసులతో లాఠీదెబ్బలు తిన్నారు.. అంతేగానీ అయాచితంగా వచ్చి అధికార పీఠాలపై కూర్చోలేదని స్పష్టంచేస్తున్నారు. కానీ బీజేపీలో పక్కా ప్రణాళిక ప్రకారం కుటుంబ పాలన కొనసాగుతుందని రాజకీయ పండితులు చెప్తున్నారు. బీజేపీలో తండ్రులు, తల్లులు అధికార పదవుల్లో ఉంటే, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొదట వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకొంటారు. ఆ తర్వాత మెల్లగా రాజకీయాల్లోకి వచ్చి పదవులు చేపడుతారు అని పేర్కొంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పదవిలోకి వచ్చేవరకూ ఆయన కుమారుడు జైషా ఎవరో కూడా చాలామందికి తెలియదు. తండ్రి కేంద్రంలో చక్రం తిప్పటం మొదలుపెట్టగానే, కొడుకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని తన చేతుల్లోకి తీసుకొని చక్రం తిప్పటం మొదలుపెట్టారు. ఇంతలోనే అంత శక్తిమంతమైన వ్యక్తిగా ఎలా ఎదిగారు? అని క్రీడా పండితులు ప్రశ్నిస్తున్నారు.
అవినీతికి కేరాఫ్ బీజేపీ
ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేశారు. తమకు అధికారం ఇస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తెలంగాణను ఆనుకొనే ఉన్న కర్ణాటకలో బీజేపీయే అధికారంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో అవినీతిపై పుంఖాను పుంఖాలుగా కథలు వినిపిస్తాయి. అక్కడి ప్రభుత్వానికి ‘40% కమీషన్రాజ్’ అని ముద్ర పడింది. ఉత్తరప్రదేశ్లో ఓ చోట బీటీ రోడ్డు వేయగా, కాలితో తంతే అది లేచిపోతున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్, హర్యానాలో అవినీతి గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో అవినీతి తక్కువని ఇటీవల సీఎస్డీఎస్ సర్వే వెల్లడించింది.