న్యూఢిల్లీ, జనవరి 16: బీజేపీ సోషల్ వేగు ‘టెక్ఫాగ్’ (Tek Fog) ఆపరేటర్లకు 2018లో పై నుంచి ఓ టాస్క్ వచ్చింది. ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను పంపించారు. వాటిని యాప్ ద్వారా అన్ని వాట్సాప్ గ్రూపులకు పంపించాలని, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులకు రిైప్లెగా నగ్న ఫోటోలను ట్వీట్ చేయాలని, ఇవే ఫొటోలను ట్వీట్ చేయాలని, ఫేస్బుక్లో షేర్ చేయాలని సూచించారు. వందలాది ఖాతాల్లో ఈ ఫొటోలు కనిపించాయి. ఈ వేధింపులు భరించలేక ఆ యువతి తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసుకొన్నారు. ఆమె పేరు షీలా రషీద్. జేఎన్యూ విద్యార్థిని. బీజేపీ విధానాలను విమర్శించేవారిని ఆ పార్టీ ఐటీ సెల్ ఎలా వేధిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహిళా జర్నలిస్టులను కూడా బీజేపీ ఐటీ సెల్, బీజేవైఎం దారుణంగా వేధించింది. వీరి ఆలోచనలు సోషల్ మీడియా ద్వారా బయటకు రాకుండా అడ్డుకోవడ మే కాదు వారిని బెదిరించడం, నోరెత్తకుండా చేయ డం ఈ టెక్ ఫాగ్ ఆపరేటర్ల విధుల్లో ఒకటి. బీజేపీ ఐటీ సెల్ టెక్ ఫాగ్ సాయంతో మహిళా జర్నలస్టులను ఎలా వేధించిందన్న దానిపై ‘ద వైర్’ (The Wire) కథనం.
టెక్ఫాగ్ యాప్ స్క్రీన్ షాట్లలో ఉన్న డాటాబేస్ ఫోల్డర్లను బట్టి అనుమానం ఉన్న లక్షకు పైగా ట్విట్టర్ ఖాతాలపై వైర్ సంస్థ సాంకేతిక విశ్లేషణ చేపట్టింది. ఖాతా తెరిచిన తేదీ, అందులో పోస్టులు, లైకులు, షేర్లు చేసే విధానాన్ని గమనించింది. ఈ విశ్లేషణలో 40,500 ట్విట్టర్ ఖాతాలు ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించింది. ఇందులో ఒక్కో ఖాతా నుంచి రోజుకు 350 ట్వీట్లు చేస్తున్నట్టు వైర్ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఒక్కో ఖాతా నుంచి కేవలం 15 నిమిషాల్లోనే 900 ట్వీట్లు అప్లోడ్ అయినట్టు పేర్కొన్నది. ఢిల్లీలో అల్లర్ల సమయంలో విద్వేష ప్రచారం, మర్కజ్ వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువైందంటూ ప్రచారం ఇలా జరిగిందని వైర్ తెలిపింది. ఎన్నికల సమయంలో, రాజకీయ పరంగా ముఖ్యమైన సంఘటనల సమయంలో టెక్ఫాగ్ ఆపరేటర్లకు పని ఎక్కువగా ఉంటుంది. అందుకే అప్పుడు వాళ్లకి ఇన్సెంటివ్లు కూడా ఇస్తారు.
‘దేశంలో శక్తిమంతమైన రాజకీయ పార్టీ తన వనరులను మహిళలను వేధించడానికి ఉపయోగిస్తున్నది. తద్వారా వారి నోరు మూ యించడానికి ప్రయత్నిస్తున్నది’ అని ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ అన్నారు. ‘టెక్ఫాగ్ అనేది ఏదో గుర్తు తెలియ ని వ్యక్తులు ఉపయోగించేది కాదు. దీన్ని వాడేవారు రాజకీయ వ్యక్తులు. దీనిపై అధికారంలో ఉన్నవారితో పాటు ఇతర నేతలు కూడా మాట్లాడటం లేదు. ఇది రేపు మన కూతుళ్లకు కూడా ఎదురు కావచ్చు’ అని ఆమె ట్వీట్ చేశారు.