BJP : మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఈ బిల్లు కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి చాలా కీలకం. అందుకే తన పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. దీని ప్రకారం బీజేపీకి చెందిన ఎంపీలు పార్లమెంట్కు హాజరవ్వడం తప్పనిసరి. మూడు రోజులపాటు ఎలాంటి సెలవును మంజూరు చేయరు.
గురువారం నుంచి శనివారం వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు ప్రవేశబెట్టబోతున్నట్లు, కేంద్ర మంత్రులు సహా సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని విప్లో పేర్కొన్నారు. నిర్ణీత తేదీలలో ఎలాంటి సెలవు ఇవ్వబోమని, ప్రతి ఒక్కరి హాజరు సభలో ఎంతో కీలకం అని విప్ నోటీసులో వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 2023లో ప్రవేశపెట్టిన నారిశక్తి విధాన్ యాక్ట్ను తాజా సమావేశాల్లో సవరించనున్నారు. నారీశక్తి వందన్ అధినియం పేరుతో బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ బిల్లును సవరిస్తారు.
ఇదే అంశంపై, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశంపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే తాజా పార్లమెంట్ సమావేశాల్ని నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.