న్యూఢిల్లీ: మంగళవారం, బుధవారం జరిగే పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని తమ పార్టీ ఎంపీలను బీజేపీ ఆదేశించింది. రాజ్యసభ, లోక్ సభ బీజేపీ సభ్యులకు ఈ మేరకు మూడు లైన్ల విప్ను సోమవారం జారీ చేసింది. ‘ఆగస్ట్ 10 మంగళవారం, ఆగస్ట్ 11 బుధవారం రాజ్యసభలో ముఖ్యమైన అంశాలపై చర్చ, ముఖ్యమైన బిల్లుల ప్రవేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభలోని బీజేపీ సభ్యులంతా ఈ రెండు రోజులు సభకు హాజరై ప్రభుత్వానికి మద్దుతు ఇవ్వాలి’ అని ఒక నోటీసులో బీజేపీ పేర్కొంది. మరోవైపు మంగళవారం లోక్సభకు బీజేపీ ఎంపీలంతా హాజరుకావాలని కోరుతూ మూడు లైన్ల విప్ జారీ చేసింది.
జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్ 13న ముగియనున్నాయి. పెగాసస్ స్పైవేర్ అంశం, రైతుల నిరసనలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరుగలేదు. కాగా, విపక్షాల గందరగోళం మధ్య కొన్ని ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. మరో మూడు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నందున మరి కొన్ని ముఖ్య బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది.