Lucknow | యూపీ బీజేపీకి రెండు రోజులుగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొదట ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి షాకిచ్చారు. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీలో చేరిపోయారు. ఈ ఘటన గడిచి, 24 గంటల్లోనే మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. ఏం జరుగుతుందో అని ఆలోచించే లోపలే.. నేతలు ముఖ్యమంత్రి యోగికి షాకులిస్తున్నారు. దీంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వామి మౌర్యతో పాటు నలుగురు ఎమ్మెల్యేలను తిరిగి బీజేపీలో చేర్చుకోవడానికి పావులు కదుపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా రంగంలోకి దిగారు. ఢిల్లీ వేదికగా ఓ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూపీ ముఖ్యమంత్రి యోగి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా హాజరయ్యారు.
టిక్కెట్ల పంపిణీ, యోగి పోటీ చేయడం, ప్రస్తుత పరిస్థితులతో పాటు ఈ ఐదుగురి వ్యవహారం కూడా ప్రధానంగానే చర్చించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు మంత్రులు వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. ఎమ్మెల్యేలు కూడా అంతే. ఇలా సరిగ్గా ఎన్నికల సమయంలో పార్టీని వీడి వెళితే, పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని, అది ప్రతిపక్ష సమాజ్వాదీకి కలిసి వస్తుందని అధిష్ఠానం భావించి, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు రాజీనామా చేసి వెళ్లిపోయిన నలుగురు ఎమ్మెల్యేలను తిరిగి బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్షా తగు డైరెక్షన్ ఇస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా వారిని తిరిగి బీజేపీలోకి తీసుకురావాలన్నది అధిష్ఠానం ప్లాన్. ఇక.. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలకు ఈసారి అధిష్ఠానం ఝలక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నవారు, పనితీరు బాగోలేని వారి జాబితా ఒకటి అధిష్ఠానానికి చేరిందని, ఓ 50 మంది ఎమ్మెల్యేలకు మొండి చేయి ఇస్తుందని తెలుస్తోంది.