BJP | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆదాయంలో దేశంలోనే ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. దేశంలోని ఆరు ప్రధాన జాతీయ పార్టీలు తమ ఆదాయాన్ని వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3,077 కోట్ల ఆదాయం ఉన్నట్టు తెలుపగా, అందులో కేవలం బీజేపీకే 2,361 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) బుధవారం వెల్లడించింది.
మొత్తం ఆదాయంలో బీజేపీ షేర్ 76.73 శాతం కాగా, 452.375 కోట్ల వార్షిక ఆదాయం పొంది 14.70 శాతంతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండూ కాక బీఎస్పీ, ఆప్, ఎన్పీపీ, సీపీఐ-ఎం పార్టీలు తమ ఆదాయాన్ని వెల్లడించాయి. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య బీజేపీ ఆదాయం 23.16 శాతం పెరిగి 2360.844 కోట్లకు చేరింది. ఇదే వ్యవధిలో కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ ఆదాయం వరుసగా 16.42, 12.68, 33.14 శాతం తగ్గుతూ వచ్చాయి.