న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ కలవరపెడుతున్నదని సుఖ్విందర్ వ్యాఖ్యానించారు.
తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి రాహుల్గాంధీ ప్రస్తావిస్తే అది దేశద్రోహం అని బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, సరిహద్దుల్లో మన సైనికులు ప్రమాదకర స్థితిలో ఉన్నారనేది రాహుల్గాంధీ ఉద్దేశమని, అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఎలా అవుతుందని సుఖు పశ్నించారు.
రాహుల్గాంధీ కుటుంబ సభ్యులంతా దేశం కోసమే తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురించి బీజేపీ నేతలు నోటికొచ్చిన ఆరోపణలు చేయడం చూస్తుంటే వాళ్లు భయపడుతున్నారనే సంగతి అర్థమవుతుందని సుఖ్విందర్ సింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.