Lok Sabha Elections | లక్నో : దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్పై చాలా ఆశలే ఉన్నాయి. 80 లోక్సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం. అయితే, పశ్చిమ యూపీ మాత్రం కమలం పార్టీని కలవరానికి గురి చేస్తున్నది. 16 లోక్సభ స్థానాలు ఉన్న ఈ ప్రాం తంలో ముస్లింల ఓట్లు గెలుపోటములను ప్ర భావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో 19 నుంచి 42 శాతం వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. కాబట్టి, ముస్లిం ఓట్ల చీలకపై ఇక్కడ బీజేపీ ఆశలు పెట్టుకున్నది. మరోవైపు ముస్లిం ఓట్లు గంపగుత్తగా పొందితే ఈ 16 స్థానాలను దక్కించుకోవచ్చని సమాజ్వాదీ(ఎస్పీ) – కాంగ్రెస్ కూటమి భావిస్తున్నది.
విడిగా పోటీ చేస్తున్న ఎస్పీ, బీఎస్పీ
2014 ఎన్నికల్లో పశ్చిమ యూపీలోని మొత్తం 16 స్థానాలనూ బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి. కానీ, 2019కి వచ్చే నాటికి రాజకీయ సమీకరణాలు మారాయి. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తు పెట్టుకోవడంతో ముస్లింలు ఏకపక్షంగా ఈ కూటమి వైపు నిలిచారు. దీంతో 16 సీట్లలో బీజేపీ కేవలం 9 మాత్రమే గెలుచుకోగలిగింది. బీఎస్పీ 4, ఎస్పీ 3 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నది. జయంత్ సింగ్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ.. బీజేపీతో జతకట్టింది. కాంగ్రెస్తో కలిసి ఎస్పీ పోటీ చేస్తున్నది. ఇలా గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన మూడు పార్టీలూ ఈసారి మూడు దిక్కులయ్యాయి.
ముస్లిం ఓట్లు చీలే అవకాశం
బీఎస్పీ, ఎస్పీ విడిగా పోటీ చేయడం వల్ల ముస్లిం ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉన్నది. పైగా ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న మెజారిటీ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ రెండూ ముస్లింలనే అభ్యర్థులుగా నిలుపుతున్నాయి. ఇది కూడా ముస్లింల ఓట్ల చీలికకు కారణం కావొచ్చు. ఇక, అప్నాదల్(కే)తో పొత్తు పెట్టుకొని ముస్లింలు మెజారిటీగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ కూడా ప్రణాళికలు రచిస్తున్నది. బీజేపీ కూడా ముస్లిం ఓట్లను పెంచుకోవాలని భావిస్తున్నది. ముఖ్యంగా పస్మంద ముస్లింల ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నది. పూర్తిగా ముస్లిం ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్లతో గత ఎన్నికల్లో బీజేపీ 10 లోపే ఓట్లు వచ్చినవి చాలా ఉన్నాయి. ఇలాంటి బూత్లలో ఈసారి కనీసం 50 ఓట్లు పొందాలనే లక్ష్యం పెట్టుకొని బీజేపీ బూత్ కమిటీలు పని చేస్తున్నాయి. ఇలా రెండుమూడు పార్టీల మధ్య ముస్లిం ఓట్లు కనుక చీలితే అది బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ముస్లిం ఓట్లు గంపగుత్తగా ఎస్పీ – కాంగ్రెస్ కూటమికి లేదా బీఎస్పీకి పడితే బీజేపీకి పశ్చిమ యూపీలో మెరుగైన ఫలితాలు రాకపోవచ్చు.