చెన్నై: బీజేపీ, దానికి కేంద్రంలో మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన మనస్తత్వమని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. బుధవారం జరిగిన తమిళనాడు సీఎం స్టాలిన్ 70వ జన్మదిన వేడుకల్లో తేజస్వి యాదవ్ పాల్గొన్నారు.
ద్రవిడ దిగ్గజాలైన పెరియార్, అన్నాదురై, కరుణానిధి నుంచి వారసత్వంగా వచ్చిన నాయకత్వాన్ని స్టాలిన్ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. సామాజిక న్యాయ విలువల నుంచే సమర్థవంతమైన నాయకత్వం వస్తుందని అన్నారు. ఈ సభ సామాజిక న్యాయ నేపథ్యం కలిగిన పార్టీల సమావేశం అని అభివర్ణించారు. దేశ ప్రజలందరికీ ఐక్య సంకల్పం ద్వారానే నియంతృత్వ రాజకీయాలకు అడ్టుకట్ట వేయొచ్చన్నారు.