చెన్నై, జూన్ 1: బీజేపీకి మరో మిత్రపక్షం దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయపార్టీతో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే ఇప్పుడు ఆ పార్టీపై దుమ్మెత్తిపోసింది. బీజేపీ తమిళ వ్యతిరేక పార్టీ అని విమర్శించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ఎంజీ రామచంద్రన్, దివంగత సీఎం జయలలిత క్యాబినేట్లో మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు సీ పొన్నయన్ మాట్లాడుతూ ‘బీజేపీ తమిళ వ్యతిరేకి. బలవంతంగా మాపై హిందీని రుద్దాలని ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపునివ్వాలని కోరినా వినిపించుకోవడం లేదు. నీట్ను బలవంతంగా రుద్దాలని చూస్తున్నది. రాష్ర్టాల హక్కులను గుంజుకుంటున్నది’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.