జోయ్నగర్: అయోధ్యలో జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్ ఓ జిమ్మిక్ షో అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఆ షో చేపడుతున్నట్లు ఆమె ఆరోపించారు. సౌత్ 24 పారగనాస్ జిల్లాలోని జోయ్నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఇతర వర్గాలను వేరు చేసి నిర్వహించే పండుగలకు మద్దతు ఇవ్వబోనని తెలిపారు. మతం ఆధారంగా ప్రజల్ని విభజించడాన్ని తాను నమ్మబోనని చెప్పారు. అన్ని వర్గాలను కలిసి ముందుకు నడిపే పండుగులను, ఐక్యత మాత్రమే తాను నమ్ముతానని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారమే బీజేపీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిందని, కానీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆలయాన్ని ఓపెన్ చేయడం ఓ జిమ్మిక్ షో అని మమతా విమర్శించారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుమారు ఏడు వేల మంది ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు.