నూపుర్ వ్యాఖ్యలతో పార్టీలో ఊహించని సంక్షోభం
ఇస్లామిక్ దేశాల ఆగ్రహంతో ఒక్కసారిగా అవాక్కు
మూగబోయిన నేతల గొంతులు.. టీవీ చర్చల్లో మాయం
సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గంపై అధిష్ఠానం మల్లగుల్లాలు
కార్యవర్గ సమావేశాలపై పీఎంవో, పార్టీలో మథనం
ఆరు తీర్మానాలు ఖరారు.. మత విద్వేషంపైనా తీర్మానం!
రాష్ట్రపతి ఎన్నిక, ఇంటెలిజెన్స్, ఈసీ నియామకాలపై నజర్
‘చెరపకురా చెడేవు’ అనే సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చగొట్టడం మొదటికే మోసం తీసుకొచ్చింది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ విద్వేష వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో భారత్కు ఉన్న విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. దేశంలోని హిందూ ఓటర్ల ఆగ్రహంగా ఉన్నారు.
ఒకరకంగా బీజేపీ ఇప్పుడు పెను సంక్షోభంలో చిక్కుకొన్నది. దీంతో నిత్యం విద్వేష వ్యాఖ్యలు చేసే బీజేపీ నాయకగణం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. మీడియా ప్రైమ్ టైమ్ చర్చలకు ఆ పార్టీ నేతలు ముఖం చాటేశారు. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక పార్టీ నాయకత్వం తల పట్టుకొంటున్నది. ప్రధానమంత్రి కార్యాలయం, ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు
ఈ అంశంపైనే రాత్రి పగలు మల్లగుల్లాలు పడుతున్నయి.
(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) : బీజేపీ జాతీయ కార్యదర్శులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అరబ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆ దేశాలతో భారత్ సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి. ఇస్లామిక్ దేశాలు భారతదేశ వస్తువులను బహిష్కరిస్తుండటం, భారతీయ ఉద్యోగులను తొలగించాలని పెద్ద ఉద్యమమే నడుస్తుండటం మోదీ సర్కారుపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నది. ఈ ఊహించని సవాల్కు దీటుగా కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే మనకు నిత్యం చమురు, పామాయిల్ ఆ దేశాల నుంచే రావాలి. దాదాపు కోటిమంది భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వారి ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం మనకు వస్తున్నది. ఇప్పుడు ఏమాత్రం పట్టు తప్పినా భారత్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
సంక్షోభం ముదిరి మోదీ ప్రభుత్వం తల బొప్పికట్టే పరిస్థితి రావటంతో ప్రధాని కార్యాలయం ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను వెతుకుతున్నది. పీఎంవోతో పాటు, ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం రాత్రిపగలు ఈ అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెల 2, 3 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష ప్రసంగాల కట్టడిపై ఏకంగా ఓ తీర్మానమే ఆమోదించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిపడ్డాయి. మరో వారంలో ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పుడు ఇద్దరే కమిషనర్లు ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులు ఉండాలి. దీంతో వెంటనే మరో సభ్యుడిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) డైరెక్టర్ల పదవీకాలం కూడా త్వరలో ముగుస్తున్నది. బీజేపీ నేతల వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకొంటామని అల్ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సంస్థలకు వెంటనే అధిపతులను నియమించాల్సి ఉన్నది. ఈ పరిణామాలు పీఎంవోను, బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండు అధికార కేంద్రాలు ఈ అంశాలపైనే రాత్రిపగలు చర్చోపచర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
పార్టీ సమావేశాలపై అంతర్మథనం
పార్టీకి, ప్రభుత్వానికి ఊహించని సంక్షోభం ఎదురైన నేపథ్యంలో జూలైల్లో హైదరాబాద్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పలు అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు కమలదళం మథనం చేస్తున్నట్టు తెలిసింది. సమావేశాల్లో మొత్తం ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. పోయిన ప్రతిష్ఠను కాపాడుకొనేందుకు మత విద్వేష సంక్షోభంపై సమావేశాల్లో ఓ తీర్మానం ఆమోదించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ రాజకీయాలు తదితర అంశాలపై మిగతా తీర్మానాలు ఉంటాయని సమాచారం. పార్టీ క్యాడర్కు కూడా ప్రధాని మోదీ పార్టీ సిద్ధాంతం, నేతల ప్రసంగాలపై సందేశం ఇవ్వనున్నారని తెలిసింది.
రాజ్యసభకు పవన్కల్యాణ్?
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనుండటంతో రాజ్యసభ సీట్ల భర్తీపై బీజేపీ నజర్ పెట్టింది. రాష్ట్రపతి పెద్దల సభకు నామినేట్ చేసే 6 సీట్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలంలోనే వీటిని భర్తీచేయాలని మోదీ సర్కారు అభ్యర్థుల కోసం వెదుకుతున్నది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కూడా ఖరారు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం త్వరలోనే పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం కానున్నది. ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరుగనున్నది. మరోవైపు ప్రతిపక్ష నేతలపై కేంద్రప్రభుత్వం ఎడాపెడా సీబీఐ, ఈడీలను ప్రయోగించి వేధిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆయా పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. మోదీ సర్కారు మెడలు వంచేందుకు పార్లమెంటును స్తంభింపజేయాలని భావిస్తున్నాయి.
కాటేస్తున్న సొంత భూతం
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దశాబ్దాలుగా బీజేపీ మత విద్వేష ప్రసంగాలను, చర్యలను ప్రోత్సహిస్తూ వస్తున్నది. ఎంత వివాదాస్పదంగా మాట్లాడితే అంతగా ప్రోత్సహిస్తూ నేతలకు ప్రమోషన్లు ఇస్తున్నది. ఇప్పుడు ఆ విద్వేష భూతం అమాంతం పెరిగి బీజేపీనే మింగేసే స్థితికి వచ్చింది. నూపుర్ శర్మను పార్టీనుంచి బహిష్కరించటంతో ఈ వాస్తవం ఒక్కసారిగా బయటపడింది. బీజేపీ పెంచిపోషించిన కరుడుగట్టిన హిందూత్వవాదులంతా సోషల్మీడియాలో నూపుర్ శర్మకే మద్దతుగా నిలిచారు. మోదీని అవతార పురుషుడిగా కొలిచే ఈ వర్గం తాజాగా ఆయనపైనే తిరగబడింది. ‘షేమ్ ఆన్ మోదీ’, షేమ్ ఆన్ బీజేపీ, స్టాండ్ విత్ నూపుర్ శర్మ’ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ఈ పరిస్థితి చూస్తుంటే బీజేపీ ఇంతకాలం పెంచిపోషించిన మతతత్వ భూతంపై అదుపు కోల్పోయిందని విశ్లేషకులు అంటున్నారు. గొప్ప కమ్యూనికేటర్గా బీజేపీ నేతలు కొనియాడే ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ క్యాడర్కు సరైన మార్గదర్శనం చేయకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టింది. పార్టీ అనుమతి లేకుండా నేతలెవరూ మీడియా చర్చల్లో పాల్గొనరాదని ఆదేశించినట్టు సమాచారం. బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఏ వర్గాన్నీ, మతాన్నీ కించపర్చేలా వ్యాఖ్యలు చేయరాదని స్పష్టంచేసినట్టు తెలిసింది.
మరేం పర్వాలేదు
నూపుర్ వ్యాఖ్యలపై గోయల్ కవరింగ్
నూపుర్ శర్మ, జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఒకవైపు గల్ఫ్ దేశాలు భగ్గుమంటున్నప్పటికీ.. వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ జరుగుతున్న నష్టాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలకు దిగారు. ప్రవక్తపై ప్రభుత్వ వ్యక్తులు ఆ వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, గల్ఫ్తో సత్సంబంధాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. మరోవైపు, నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని గుజరాత్లో సూరత్లోని ఓ బ్రిడ్జిపై కొందరు పోస్టర్లు అతికించి డిమాండ్ చేశారు.