న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ భారీ మొత్తమే వెచ్చిస్తున్నట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కరికి రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.800 కోట్లు ఇవ్వజూపారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఇంత భారీగా ధనం వెదజల్లేందుకు బీజేపీ ప్రయత్నించినా తమ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆకర్షితులు కాలేదని పేర్కొన్నారు.
ఆప్పై బీజేపీ ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టిందన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన ఆయన నివాసంలోనే గురువారం ఆప్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఈ భేటీకి 53 మంది హాజరయ్యారు. ఈడీ కేసులో సత్యేంద్ర జైన్ జైల్లో ఉండగా, మిగతావారు ఢిల్లీలో లేకపోవటం వల్ల సమావేశానికి ఫోన్కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చారని భరద్వాజ్ తెలిపారు. కొద్ది రోజులుగా 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన కేజ్రీవాల్, తన నివాసంలోనే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. నిమిషాల వ్యవధిలోనే ముగిసిన ఈ సమావేశం అనంతరం కేజ్రీవాల్ నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బీజేపీ రూ. 800 కోట్లు వెదజల్లటంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు నిర్వహించాలని సౌరభ్ డిమాండ్ చేశారు.
ఆ డబ్బు ఎక్కడిది?
తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ వెదజల్లుతున్న రూ.800 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘మా ఒక్కొక్క ఎమ్మెల్యేకు బీజేపీ రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చింది. నా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రూ.800 కోట్లు సిద్ధం చేసింది. ఈ డబ్బు ఎక్కడినుంచి తెచ్చారో చెప్పాలని ఈ దేశ ప్రజలు కోరుతున్నారు. ఇది జీఎస్టీ నుంచి తెచ్చారా? లేక పీఎంకేర్స్ ఫండ్ నుంచి తెచ్చిన సొమ్మా? లేదంటే బీజేపీ మిత్రులు సమకూర్చారా?’ అని నిలదీశారు. ఢిల్లీ డిఫ్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ దాఖలుచేసినది తప్పుడు ఎఫ్ఐఆర్ అని ఆరోపించారు.
‘ఒక సీరియల్ కిల్లర్ ఒకే తరహాలో ఆరు హత్యలు చేశాడు. అదే తరహాలో మరో హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బాధితుడేమో అతడే హత్యాయత్నం చేశాడని చెబుతున్నాడు. కానీ మీడియా సాక్ష్యం చూపాలని బాధితుడిని అడుగుతున్నాయి. ప్రత్యక్ష సాక్షే చెబుతున్నాడు.. అదే తరహాలో హత్యాయత్నం జరిగిందని.. పోలీసులు ఆధారాలు సేకరిస్తారు. ముందు నిందితుడిని అరెస్ట్ చేయాలి కదా’
– సర్కారు కూల్చివేత యత్నాలపై కేజ్రీవాల్ ట్వీట్