జైపూర్ : రాజస్థాన్లో అస్థిరతను సృష్టించాలని బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ నేతలను ఆదేశించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. జోధ్పూర్ హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో బుధవారం ఆయన కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘వారు (బీజేపీ) పేదల ఇండ్లను బుల్డోజ్ చేస్తారు. మా ప్రభుత్వం పరువు తీయాలని, అస్థిరతను సృష్టించాలని వారి హైకమాండ్ వారికి సూచించింది.
సీఎం అభ్యర్థులుగా మారిన వారికి పోటీ ఉంది (వారిలో). వారికి హోంవర్క్ ఇచ్చారు’ అని అశోక్ గెహ్లాట్ను ఉటంకిస్తూ ఏఎన్ఐ పేర్కొంది. జలోరి గేట్ సర్కిల్పై ఇస్లామిక్ జెండాలను ఉంచడంపై సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చెలరేగింది. దీంతో రాళ్లదాడి చోటు చేసుకోగా.. ఐదుగురు పోలీసులు సైతం గాయపడ్డారు. మతం, కులం, రాజకీయ పార్టీలకు అతీతంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
ఎలాంటి హింసాకాండ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇదిలా ఉండగా.. జలోరి గేట్ ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు 97 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వరుసగా రెండో రోజు పది పోలీస్స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగింది. అలాగే మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు.