ముంబై: ప్రాంతీయ మిత్రులను బీజేపీ క్రమంగా అంతం చేస్తున్నదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. బీజేపీ వంటి భావజాలంతో నడిచే పార్టీ మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగిస్తుందంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శమన్నారు. బీహార్లో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేడీయూలో బీజేపీ చిచ్చు రాజేసింది. దీంతో వెంటనే తీరుకున్న సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతోపాటు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో మరోసారి బీహార్ సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ మీడియాతో బుధవారం మాట్లాడారు. పాంత్రీయ మిత్ర పార్టీలను బీజేపీ అంతం చేస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు. అకాలీ దళ్ ఇప్పటి వరకు బీజేపీ ఉందని, అయితే పంజాబ్లో ఆ పార్టీ అంతానికి చేరుకుందని శరద్ పవార్ తెలిపారు. అలాగే మహారాష్ట్రలో శివసేన, బీజేపీ చాలా ఏళ్లుగా కలిసి ఉన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం శివసేనను చీల్చిన బీజేపీ ఆ పార్టీని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దీని కోసం ఏక్నాథ్ షిండే వర్గానికి సహకరించిందని ఆరోపించారు.
కాగా, శివసేన రెబల్ వర్గం వివాదాన్ని వీడి మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని శరద్ పవార్ సూచించారు. విభేదాలతో కాంగ్రెస్ను వీడిన తాను కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కొత్త గుర్తుతో ప్రజల్లోకి వెళ్లానని అన్నారు.