కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి భారతీయ జనతాపార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ దేశాన్ని తెగనమ్ముతున్నదని ఆమె మండిపడ్డారు. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళీఘాట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మమత ప్రసంగించారు. ప్రజల కోసం పనిచేయడమే తమ ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా మాతో పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతలు ఏజెన్సీలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని మమతాబెనర్జి విమర్శించారు. కొందరు తమ పార్టీని విడిచి బీజేపీలోకి వెళ్లారని, ఇప్పుడు వాళ్ల నిజస్వభావం తెలుసుకుని సొంతగూటికి వస్తున్నారని ఆమె చెప్పారు. ఇక విద్యార్థులు దేశ భవిష్యత్తు అని మమతాబెనర్జి పేర్కొన్నారు. వారు భవిష్యత్తులో రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పాలని సూచించారు. ఎన్నికల అనంతర హింసపై సీబీఐ దర్యాప్తుపై తమకు అభ్యంతరం లేదని, కానీ సీబీఐ అధికారులు తమ వెంట బీజేపీ నేతలను ఎందుకు తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు.