ఓ పేద విద్యార్థికి ఓ 2 వేలస్కాలర్ షిప్ పెద్ద లెక్క..
ఓ వృద్ధుడికి టికెట్ రాయితీ కింద రూ.50 ఇస్తే మందులకు పనిచేస్తది..
ఓ నిరుపేద కుటుంబానికి గ్యాస్ సబ్సిడీ వస్తే నెల ఖర్చుకు సరిపోతది..
ఓ ఉన్నత విద్యార్థికి ఫెలోషిప్ అంటే జీవితంలో స్థిరపడినంత భరోసా..
కానీ, కేంద్రం వారికి ఆధారం లేకుండా చేసింది! బతుకుపై, భవిష్యత్తు ఆశలపై నీళ్లు చల్లింది!!
(స్పెషల్ టాస్క్ బ్యూరో/నేషనల్ డెస్క్) హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ఎడాపెడా పెంచి సామాన్యుడి నడ్డివిరిచిన బీజేపీ సర్కారు.. పేదలకు అందించే రాయితీలను ఒక్కొక్కటిగా కోత పెడుతున్నది. పసిపిల్లల సంరక్షణ నుంచి పండు ముసలోళ్ల రైలు టికెట్ వరకు, స్కూల్ పిల్లల స్కాలర్షిప్ నుంచి యూనివర్సిటీ విద్యార్థుల ఫెలోషిప్ వరకు, కిరసనాయిల్ నుంచి గ్యాస్ బండ వరకు సబ్సిడీలను ఎత్తివేయడమే పనిగా పెట్టుకొన్నది. ఎనిమిదిన్నరేండ్ల మోదీ పాలనలో కోతల జాబితాలో మచ్చుకు కొన్ని..
వంటగ్యాస్పై సబ్సిడీ ఎత్తివేత
2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎల్పీజీపై రూ. 400 వరకు ఉన్న సబ్సిడీని కేంద్రం మొత్తంగా ఎత్తేసింది. ఉజ్వల పథకం కింద పేదలకు ఇస్తున్న ఉచిత సిలిండర్ల పథకానికి 95 శాతం నిధులను తగ్గించింది. ‘పహల్’ పథకాన్ని కూడా ఎత్తేసే యోచనలో ఉన్నది. కిరోసిన్పై ఇచ్చే సబ్సిడీని కూడా 2021లోనే ఎత్తేసింది.
వృద్ధులకు రాయితీ కట్
వృద్ధులకు రైల్వే టికెట్లపై ఇస్తున్న రాయితీని కరోనా సంక్షోభంలో ఎత్తేసిన ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. అయితే, జనరల్, స్లీపర్ క్లాసుల్లో మాత్రమే 70 ఏండ్లు పైబడిన వారికి రాయితీ అంటూ కొత్త మెలిక పెట్టింది. ఇక, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే టికెట్పై 50 శాతం ఉన్న రాయితీ ఇంకా పునరుద్ధరించలేదు.
అవార్డుల్లోనూ కోత
శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగంలో ఇస్తున్న సుమారు 300 అవార్డులను కేంద్రం నిలిపివేసింది. నోబెల్ తరహాలో విజ్ఞాన్ రత్న అవార్డును ఇస్తామని పేర్కొంటూ ఈ అవార్డులను రద్దు చేసింది. మరోవైపు పరిశోధనలకూ కేంద్రం అత్తెసరు నిధులు కేటాయిస్తున్నది. పరిశోధన రంగానికి గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కంటే 3.9 శాతం నిధులకు కోతపెట్టింది.
ఫెలోషిప్లకు కొర్రీ
జాతీయ అర్హత పరీక్ష (నెట్) కాకుండా, వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఫిల్, పీహెచ్డీ సీట్లలో చేరే విద్యార్థులకు యూజీసీ ద్వారా ఫెలోషిప్లను కేంద్రం రద్దు చేసింది. దీంతో పరిశోధనల కోసం ప్రతీనెలా అందే రూ. 25 వేల మొత్తానికి విద్యార్థులు దూరమయ్యారు.
మైనార్టీ విద్యార్థులకు ఎంఏఎన్ఎఫ్ రద్దు
మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (ఎంఏఎన్ఎఫ్)ను కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2019-20లో 1,251 మందికి ఈ ఫెలోషిప్ అందజేయగా, 2020-21 నాటికి 1,075 మందికి కుదించింది. ఇచ్చే నిధులను కూడా రూ.100 కోట్ల నుంచి రూ.74 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు ఆ ఫెలోషిప్నే ఎత్తేసింది.
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్కు గుడ్బై
9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఇకనుంచి స్కాలర్షిప్స్ ఇస్తామని కేంద్రం ఇటీవలే స్పష్టంచేసింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ పేరిట ఇస్తున్న వాటిని నిలిపేస్తున్నట్టు తెలిపింది. నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున 1-8 తరగతుల విద్యార్థులకు ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని చెప్పుకొచ్చింది.
హజ్ సబ్సిడీ రద్దు
ప్రతి ఏడాది ముస్లింలు జరిపే పవిత్ర హజ్యాత్రకు ఇస్తున్న సబ్సిడీని నాలుగేండ్ల కిందటే కేంద్రం ఎత్తేసింది. దీంతో ఖజానాకు ఏటా రూ.700 కోట్లు ఆదా అవుతున్నట్టు చెప్పుకొచ్చింది.
‘పీఎంకేర్స్’లోనూ..
కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన ‘పీఎం కేర్స్’ పథకానికీ అతీగతీ లేకుండా పోయింది. ఈ పథకానికి 9,042 మంది దరఖాస్తు చేసుకోగా, ఆర్థిక భారం తప్పించుకోవడానికి కేవలం 4,345 దరఖాస్తులనే కేంద్రం ఆమోదించింది.
కార్పొరేట్ పన్ను రాయితీ 1.84 లక్షల కోట్లు
పేదల ఆహారమైన బియ్యం, నూకలపై కూడా ఎడాపెడా పన్నులేస్తూ ఉసురు పోసుకొంటున్న కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీల రూపంలో లక్షల కోట్లు దోచి పెడుతున్నది. రెండేండ్లలోనే కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చినట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఆగస్టులో బయటపెట్టింది. పేదలకు సంక్షేమ పథకాలు కూడా అమలుచేయొద్దని షరతులు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం, బడా బాబులపై మాత్రం అంతులేని కరుణ చూపిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలకు రెండేండ్ల క్రితం పన్ను రాయితీలు ప్రకటించింది. దీనివల్ల 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.87,835 కోట్లు, రూ.2020-21లో రూ.96,400 కోట్ల కార్పొరేట్ పన్ను రాబడి తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం లక్ష కోట్లకుపైగానే ఉంటుందని పార్లమెంటరీ ప్యానల్ అంచనా వేసింది. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 115 బీబీఏ కింద కార్పొరేట్ కంపెనీల నుంచి 2019-20లో కేంద్రానికి రూ.9.33 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్స్ ప్రకారం ఇందులో నుంచి కంపెనీలకు రూ.1.45 లక్షల కోట్లు వెళ్లాయి.