బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమని, ఉద్యోగ వ్యతిరేక నిర్ణయమని అభివర్ణించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.
‘యూపీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించడమే తరువాయి.. బీజేపీ తన గిఫ్ట్ కార్డుతో రంగంలోకి దిగింది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించింది. బీజేపీ నిజ స్వరూపం ఏమిటో ఇప్పుడు బయటపడింది. కరోనా కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకా కోలుకోనే లేదు. ఈ సమయంలోనే కేంద్రం ఈ షాక్ ఇచ్చింది. ఇది క్రూరమైన చర్య. ఏకపక్ష నిర్ణయం. రైతులు, కార్మికులను విస్మరించింది ప్రభుత్వం. కేవలం పారిశ్రామిక వర్గాలను మాత్రమే నెత్తినెత్తుకుంటోంది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించడాన్ని విపక్షాలన్నీ కలిసి కట్టుగా వ్యతిరేకించాలి అంటూ మమత బెనర్జీ పిలుపునిచ్చారు.
కోట్లాదిమంది ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ చెల్లించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సెంట్రల్ ట్రస్టీల బోర్డు (సీబీటీ) సిఫార్సుచేసింది. ట్రేడ్ యూనియన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా, గువాహటిలో కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్పై 1977-78 తర్వాత ఇదే కనిష్ఠ వడ్డీ రేటు. అప్పట్లో ఈ రేటు 8 శాతంకాగా, అటుతర్వాత 8.25 శాతంపైనే కొనసాగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.5 శాతంగా ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవనం కోసం నిలకడైన పొదుపుసాధనంగా పరిగణించే పీఎఫ్ డిపాజిట్పై రేటును తగ్గించి 6.5 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల్ని కేంద్రం హతాశుల్ని చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ రేటు తగ్గుతూ వచ్చింది. 2015-16లో 8.8 శాతంగా ఉన్న పీఎఫ్ రేటు తాజాగా 8.1 శాతానికి పడిపోయింది.