దేశ ప్రజలను మేనిరంగుతో విభజిస్తూ.. ఒకరు జాతివివక్ష వ్యాఖ్యలు చేస్తారు.
దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ మరొకరు చిలకపలుకులు పలుకుతారు..
139 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వైఖరి ఇది.
Adhir Ranjan Chowdhury | హైదరాబాద్, మే 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. మరో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఇవే తరహా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్టు మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ నాయకుల వైఖరిని సోషల్మీడియాలో పలువురు తప్పుబడుతున్నారు. కాగా లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహారశైలి, వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.
పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ అధిర్ రంజన్ను కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘వ్యక్తిగత అభిప్రాయాల గురించి నేను మాట్లాడట్లేదు. అయితే, మన దేశంలో నెగ్రిటో క్లాస్ (నీగ్రోలు-ఆగ్నేయాసియాలోని నల్ల జాతీయుల తెగ), ప్రోటో ఆస్ట్రేలియన్, మంగోలియన్ తరగతి ప్రజలు ఉన్నారు. విశాలమైన భూభాగం కలిగిన మన దేశంలో స్థానికంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో దేశ ప్రజలందరూ ఒకే విధంగా ఎలా ఉంటారు? ఉండరు కదా. కొందరు నల్లగా, మరికొందరు తెల్లగా ఉంటారు’ అని పేర్కొంటూ పరోక్షంగా పిట్రోడా వ్యాఖ్యలను సమర్థించారు.
అధిర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. పిట్రోడా మాత్ర మే కాదు.. యావత్తూ కాంగ్రెస్ నేతలందరూ జాతివివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి షేహ్జాద్ పూనావాలా దుయ్యబట్టారు. కాగా.. దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారంరేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా.. భారత్ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్లతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.