న్యూఢిల్లీ: రాజ్యసభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ కుస్తీ పడుతున్నది. 18 మంది అభ్యర్థుల జాబితా తయారీలో మల్లగుల్లాలు పడుతున్నది. దీంతో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్తోపాటు పలువురు ప్రముఖ నేతల పేర్లు జాబితాలో మిస్ అయినట్లు తెలుస్తున్నది. 15 రాష్ట్రాలకు చెందిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న పోలింగ్ జరుగనున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ పేర్లు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఉన్నాయి. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పియూష్ గోయల్ మరోసారి పోటీ చేయనున్నారు.
కాగా, జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్తోపాటు రాజ్యసభలో బీజేపీ చీఫ్ విప్, కేంద్ర మాజీ మంత్రి శివ ప్రతాప్ శుక్లా, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఓపీ మాథుర్, వినయ్ సహస్త్రబుద్ధే పేర్లను జాబితా నుంచి తొలగించారు. అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లామ్, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలో చేరిన సంజయ్ సేథ్ పేర్లు కూడా జాబితాలో లేవు.