ముంబై, ఏప్రిల్ 8: కేంద్రం కక్షసాధింపు విధానాలను ఎండగట్టె శివసేన నేత సంజయ్రౌత్ తాజాగా మరో బాంబు పేల్చారు. ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఈ కుట్రలో సూత్రధారి, పాత్రధారి బీజేపీనేనని ధ్వజమెత్తారు. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య, కొంతమంది బిల్డర్లు, వ్యాపారులు (వీరంతా ఓ బృందం) కూడా కుట్రలో భాగస్వాములేనని తెలిపారు. ఈ తతంగమంతా కేంద్ర హోం శాఖకు తెలుసని చెప్పారు.
శుక్రవారం సంజయ్రౌత్ విలేకరులతో మాట్లాడుతూ ‘ముంబైని మహారాష్ట్ర నుంచి విడదీయడానికి గత రెండు నెలలుగా తెరచాటున కుట్ర జరుగుతున్నది. కుట్రకు పాల్పడుతున్న బృందం పలు దఫాలు సమావేశాలు నిర్వహించింది. నిధుల సమీకరణ కూడా జరిగింది. నేను చెప్పే విషయాలన్నీ నిజాలే. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. తెరచాటు కుట్ర గురించి సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కూడా తెలుసు’ అని పేర్కొన్నారు. ‘మీరు చూస్తుండండి.. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ బృందం కోర్టుకు వెళ్తుంది. ముంబైలో మరాఠీ మాట్లాడేవారి సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. ఈ కారణాన్ని చూపిస్తూ ముంబైని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతుంది. తర్వాత అభిప్రాయ సేకరణలు, కేంద్రం స్పందన తెలిసిందే. చివరికి ముంబైని తీసుకెళ్లి కేంద్రం చేతుల్లో పెట్టాలన్నదే వీరి లక్ష్యం’ అని సంజయ్రౌత్ తెలిపారు. ఈ బృందంలో మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసికి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు.