న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రజలు తిరస్కరించినప్పటికీ, దొడ్డిదారే తమ రహదారి అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓడించినా.. ప్రజాతీర్పును కాలదన్ని ఎలాగైనా గద్దెనెక్కాలనే అధికార యావతో సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను లొంగదీసుకొనేందుకు ఓ వైపు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడంతోపాటు మరోవైపు డబ్బును ఆశచూపి ఎరవేస్తున్నది. ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ దాడులు చేయించిన కమలదళం.. తమ పార్టీలో చేరితే ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇక ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు.. ఒక్కొక్కరికి రూ.20 కోట్ల చొప్పున డబ్బు ఇస్తామని ఆశజూపింది. వారు చేరితే 20 కోట్లు వారితోపాటు మరొకరిని తీసుకొస్తే అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. లేకుంటే సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తామని బెదిరించింది. ఈ విషయాన్ని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ బుధవారం మీడియా ఎదుట వెల్లడించారు.
ముందుగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని మోదీ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను, డబ్బును వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను చీల్చే కుట్రకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, అయితే మనీశ్ సిసోడియాపై బీజేపీ ప్రయోగించిన ‘షిండే’ మంత్రం విఫలమైందని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని, ఈ ఆఫర్ను కాదంటే, సిసోడియా లాగా సీబీఐ కేసులు ఎదుర్కొంటారా? అని బెదిరించిందని పేర్కొన్నారు. సిసోడియా, తమ పార్టీ ఎమ్మెల్యేలు ‘ఆపరేషన్ లోటస్’ను ‘ఆపరేషన్ బోగస్’గా మార్చారని ఎద్దేవా చేశారు. ఇది ఢిల్లీ అని, ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా ఇక్కడ కుదరదని ప్రధాని మోదీకి సవాల్ చేశారు.
ఆఫర్లు.. బెదిరింపులు
బీజేపీ నేతలు తమను సంప్రదించారని నలుగురు ఎమ్మెల్యేలు అజయ్దత్, సంజీవ్ ఝా, సోమ్నాథ్ భారతి, కులదీప్ కుమార్ పేర్కొన్నారు. సోమ్నాథ్ భారతి మాట్లాడుతూ బీజేపీలో చేరితే రూ.20 కోట్లు, మరొక ఎమ్మెల్యేను తమ వెంట తీసుకొస్తే మరో రూ.25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారని తెలిపారు. ‘సిసోడియాపై కేసులు ఫేక్ అని తమకు కూడా తెలుసునని వారు చెప్పారు. ‘ఆప్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ సీనియర్ నేతలు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలను తీసుకొచ్చే బాధ్యతను స్థానిక బీజేపీ నేతలకు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ‘ఏది ఏమైనప్పటికీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఓ బీజేపీ నేత చెప్పారని వివరించారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు తమకు కూడా ఇదేవిధమైన ఆఫర్లు, బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.
ఇది తీవ్రమైన అంశం: కేజ్రీవాల్
తాజా పరిణామాలపై సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశమై చర్చించి, భవిష్యత్తు వ్యూహాలపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కాగా, సాయంత్రం పీఏసీ సమావేశం ముగిసిన అనంతరం గురువారం పార్టీ ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరుకావాలని కేజ్రీవాల్ ఆదేశించారు. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుచనున్నట్టు వెల్లడించారు. సిసోడియా ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘మా ఎమ్మెల్యేలు ప్రాణాలైనా ఇస్తారు కానీ, పార్టీని మోసం చేయరు. వారంతా కేజ్రీవాల్ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ ఫాలోవర్లు’ అని కేంద్రానికి స్పష్టం చేశారు. తనను లొంగదీసుకోవాలన్న కుట్ర విఫలమైన తర్వాత.. ఇప్పుడు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తూ ఎమ్మెల్యేలపై బీజేపీ వల విసురుతున్నదని, సోదాల పేరుతో బెదిరిస్తున్నదని అన్నారు.