‘మా సీఎం యోగి ఓడిపోతాడని అంటావా.. నీకు పంది పాలు తాగిస్తా. నువ్వో కుక్కవి. దేశంలో ముస్లింలు అనే వాళ్లు లేకుండా చేస్తా, జాగ్రత్త’
‘యోగికి ఓటు వేయలేదో మీ ఇండ్లపైకి బుల్డోజర్లను పంపిస్తాం’
‘ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే రాధే.. రాధే అని భజన కీర్తనలు ఆలపించాలి. లేకపోతే పాకిస్థాన్కు వెళ్లిపోండి’
యూపీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సందర్భాల్లో బీజేపీ నాయకులు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలివి.
ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగో అభివృద్ధి జరుగదని తెలిసిన వాళ్లు.. సరిగ్గా ఎన్నికల ముందు మతతత్వాన్ని ముందర వేసుకోవడం రివాజుగా మారింది. లౌకిక దేశంలో మతచిచ్చు రాజేస్తూ.. విద్వేష ప్రసంగాలతో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొంటూ ఓట్లను దండుకునే సంస్కృతిని ఆ పార్టీ కొన్నేండ్లుగా పాటిస్తున్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అది స్పష్టంగా కనిపిస్తున్నది.
ముస్లింలు బొట్టు పెట్టుకొనేలా చేస్తా
– బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్
మసీదులో నమాజ్ ప్లే చేయడానికి వాళ్లకు (ముస్లింలకు) అనుమతి ఉందా? నేను ఓసారి చెక్ చేస్తా. లేదని తెలిస్తే ఆ మైక్ను, సౌండ్ బాక్స్ను తొలగిస్తా. పాకిస్థాన్లో హిందువులు ‘జైశ్రీరామ్’ అని నినాదాలు చేయలేరు. మీరు నమాజ్ను మసీదులకే పరిమితం చేయండి. బయటకు వినిపించద్దు. -ఏప్రిల్ 18, 2021
నేను ఎమ్మెల్యేగా గెలిచాక.. వాళ్లు (ముస్లింలు) గుండ్రని టోపీలు ధరించడం మానేశారు. మీరు మళ్లీ నన్ను గెలిపిస్తే వాళ్లు బొట్టు పెట్టుకొనేలా చేస్తా . -ఫిబ్రవరి 11, 2022
కరోనా సమయంలో హిందువులతో పాటు ముస్లింలకూ రేషన్ ఇచ్చాం. అందులో ఉప్పును కూడా అందించాం. అయితే మా ఉప్పు తిన్న కొందరు దేశద్రోహులుగా మారుతున్నారు. ఆ జైచంద్లు (హిందూ ద్రోహులు) ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదనుకొంటా. -ఫిబ్రవరి 11, 2022
రానున్న ఎన్నికల్లో యోగి ఓడిపోతారని ఓ ముస్లిం నాయకుడు అన్న మాటలకు స్పందిస్తూ.. ‘మా సీఎం యోగి ఓడిపోతాడని అంటావా.. నీకు పంది పాలు తాగిస్తా. దేశంలో ముస్లింలు అనే వాళ్లు లేకుండా చేస్తా. నువ్వో కుక్కవి. -ఫిబ్రవరి 15, 2022
యోగికి ఓటు వేయని ద్రోహులు యూపీ విడిచి వెళ్లాలి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
యూపీ రెండో విడుత పోలింగ్లో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. నా ఆలోచన ప్రకారమైతే.. సీఎం యోగి అధికారంలోకి రావొద్దనే వాళ్లే పెద్ద ఎత్తున ఇంటి నుంచి బయటికొచ్చి ఓట్లేశారు. అందుకే హిందూ సోదరులారా.. ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ ఉంది. మీరందరూ బయటికొచ్చి యోగికి ఓటు వేయండి. బీజేపీకి ఓటు వేయని వారికి ఒకటి చెప్పాలనుకొంటున్నా.. యోగి వేల సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు తెచ్చి పెట్టిండు. ఎన్నికలు ముగిసిన తర్వాత యోగికి ఓటు వేయని ప్రాంతాలను గుర్తిస్తారు. ఎవరు ఓటు వేయలేదో వాళ్ల ఇండ్లపైకి జేసీబీలు, బుల్డోజర్లను పంపిస్తాం. వాటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసు కదా! యూపీలో ఉండాలనుకున్నారా? లేదా? బిడ్డా.. యోగి తిరిగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి.
– ఫిబ్రవరి 15, 2022
మేం తలుచుకొంటే మీ గడ్డాలు ఉండవు
బీజేపీ ఎమ్మెల్యే మయంకేశ్వర్ సింగ్
హిందువులు గనుక తలుచుకుంటే మీ (ముస్లింలు) పొడవాటి గడ్డాలను హిందువులు పెంచుకొనే గడ్డాల్లా చిన్నగా చేస్తాం. ముస్లింలు దేశంలో ఉండాలనుకొంటే, రాధే.. రాధే అంటూ భజన కీర్తనలు ఆలపించాలి. లేకపోతే దేశ విభజన జరిగినప్పుడు వెళ్లిపోయిన వారిలాగే పాకిస్థాన్కు వెళ్లిపోండి. మీ వల్ల ఎవరికీ ఇక్కడ ప్రయోజనం లేదు.
-ఫిబ్రవరి 18, 2022