న్యూఢిల్లీ : యాస్ తుఫాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి హాజరు కారాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తప్పుపట్టారు. దీదీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు. బెంగాల్ సీఎం చిల్లర రాజకీయాలు, వ్యూహాలు మరోసారి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యాస్ తుఫాన్ తో నష్టపోయిన బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ గట్టి భరోసా ఇస్తూ ముందుకు రాగా, మమతా బెనర్జీ సైతం ప్రజల కోసం పట్టింపులను పక్కనపెట్టి హుందాగా వ్యవహరించాల్సి ఉందని నడ్డా పేర్కొన్నారు. ప్రధాని సమావేశానికి దీదీ గైర్హాజరవడం రాజ్యాంగ విలువలను కాలరాయడమేనని, సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగాల్ , ఒడిషా రాష్ట్రాల్లో యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు.