లక్నో : ఉత్తరప్రదేశ్లో మలి దశ పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. యూపీలో ఉదయం 11 గంటల వరకూ 23.03 పోలింగ్ శాతం నమోదైంది. సంభాల్లో బీజేపీ అభ్యర్ధి వాహనాన్ని ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అస్మోలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి హరేంద్ర అలియాస్ రింకూ వాహనంపై కొందరు దాడి చేశారు. అనుచరులతో పాటు అభ్యర్ధి పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు. ఘటనా స్ధలం నుంచి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యర్ధుల దాడిలో రింకూ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. రెండో దశలో భాగంగా యూపీలోని 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగుతున్నది. ఎన్నికల్లో 586 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పటిష్ట భద్రత మధ్య ఓటింగ్ కొనసాగుతున్నది. మరోవైపు కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం మహిళలకు విముక్తి కల్పించేందుకు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశామని, మహిళలకు హక్కులు కల్పించాలని, గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రధాని త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే బాలికలకు గౌరవం ఇస్తామని..అయితే దేశం మాత్రం ఇస్లామిక్ చట్టమైన షరియత్ ప్రకారం నడవదని, రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ ముందుకు వెళ్తుందని యూపీ సీఎం యోగి అన్నారు.
ఇక యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ప్రియాంక గాంధీ ఇమేజ్తో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా..దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ సన్నద్ధమవుతోంది.