Lok Sabha Elections | ఆది కావ్యమైన రామాయణంలో రాముడి పాత్రను పోషించి మన్ననలు పొందారు నటుడు అరుణ్ గోవిల్. రాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడిని బీజేపీ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నది. మీరట్ లోక్సభ స్థానం టికెట్ను కేటాయించింది. మీరట్లో వైశ్య సామాజిక వర్గం, ఘజియాబాద్లో క్షత్రియ సామాజికవర్గ అభ్యర్థులు టికెట్ కోసం పడుతుండగా.. బీజేపీ అధిష్ఠానం అరుణ్ గోవిల్ను బరిలోకి దింపాలని నిర్ణయించింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు టికెట్ కోసం పోటీ పడ్డారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అమిత్ అగర్వాల్ సైతం టికెట్ ఆశించారు. ఇటీవల మెట్రోపాలిటన్ అధ్యక్షుడు అధ్యక్షుడు ముఖేశ్ సింఘాల్, వినీత్ అగర్వాల్తో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే, ఊహాగానాలన్నింటికి తెర దించుతూ బీజేపీ అరుణ్ గోవిల్కు టికెట్ కేటాయించింది. మొదటి జాబితాలో నాలుగు పశ్చిమ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో మార్పు తథ్యమని బీజేపీ సంకేతాలిచ్చింది. మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన రాజేంద్ర అగర్వాల్కు టికెట్ నిరాకరించింది. గత ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమి అభ్యర్థి హాజీ యాకూబ్పై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ క్రమంలో తక్కువ మెజారిటీతో గెలిచే ప్రాంతాలపై దృష్టి పెట్టిన బీజేపీ.. సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ కారణంగా రాజేంద్ర అగర్వాల్కు టికెట్ నిరాకరించి.. అరుణ్ గోవిల్ను అభ్యర్థిగా బరిలోకి దింపింది.
అరుణ్ గోవిల్ 1958 జనవరి 12న కాంట్లో జన్మించారు. ఆయన తండ్రి చంద్రప్రకాశ్ గోవిల్ మీరట్ మున్సిపాలిటీలో హైడ్రాలిక్ ఇంజినీర్గా పని చేశారు. అరుణ్ గోవిల్ మీరట్లోనే శిశు మందిర్, మహవీర్, ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత సహరాన్పూర్, షాజహాన్పూర్లో చదిశారు. చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్పీ పూర్తి చేశారు. ఆయన తండ్రి ప్రభుత్వ కావాలని కోరుకున్నారు. అయితే, అరుణ్ గోవిల్ మాత్రం గుర్తుండి పోయేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అరుణ్ గోవిల్కు ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణుల్లో నాలుగోవాడు. అరుణ్ గోవిల్ నటి శ్రీలేఖను వివాహం చేసుకున్నారు.
వీరికి సోనిక, అమల్ అనే ఇద్దరు పిల్లలున్నారు. 17 సంవత్సరాల వయస్సులో వ్యాపారం కోసం ముంబయికి వెళ్లిన ఆయన… ఆ తర్వాత నటుడిగా మారారు. అరుణ్ గోవిల్ 1977లో ‘పహేలీ’ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. కుటుంబ కథా చిత్రాలను నిర్మించే నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన రామాయణం సీరియల్ను దర్శకుడు రామానంద్ సాగర్ దర్శకత్వం వహించారు. ఈ సీనియల్లో ఆయన పోషించిన పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.
సీరియల్ ప్రసారం తర్వాత ఎక్కడకు వెళ్లియాన ఆయనను చూడగానే జనం ఆయన కాళ్లపై పడేవారు. ఆయన రామాయణంతో పాటు అనేక ఇతర పౌరాణిక సీరియల్స్ కనిపించారు. లవ్-కుష్, విశ్వామిత్ర, బుద్ధ అనే టీవీ షోలలో హరిశ్చంద్ర పాత్రను పోషించారు. టీవీ సీనియర్లో ‘విక్రమ్ బేతాల్’లో రాజా విక్రమార్క పాత్ర సైతం మంచి గుర్తింపును తీసుకువచ్చింది. తెలుగులో గోవిందా గోవిందా.. ఏడుకొండల స్వామి చిత్రాల్లో వేంకటేశ్వరస్వామిగా కనిపించారు.