Karnataka | బెంగళూరు: కర్ణాటకను కుదిపేస్తున్న బీజేపీ టికెట్ కేటాయింపుల స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పార్టీ పెద్దల హస్తం దీని వెనుక ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆరెస్సెస్ నేతలు, స్వామీజీలు కూడా అందులో కీలకంగా వ్యవహరించారని తెలుస్తున్నది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ టికెట్ల కేసులో అరెస్టయిన ప్రధాన నిందితురాలు, హిందూ యాక్టివిస్ట్ చైత్ర కుందాపుర తాజాగా సంచలన విషయాలు బయటపెట్టారు. టికెట్ల స్కామ్ వెనుక పెద్దలు ఉన్నారని, స్వామీజీని అరెస్టు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని ఆమె పేర్కొనడం సంచలనంగా మారింది.
బెంగళూరులోని సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) కార్యాలయం వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘టికెట్ల స్కామ్ వెనుక పెద్దల హస్తం ఉంది. స్వామీజీని అరెస్టు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. నిజానిజాలు తెలుస్తాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ స్కామ్లో ప్రధాన నిందితురాలిగా ఉన్న చైత్రను మంగళవారం ఉడుపిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే ముడుపులు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన హిరేహడగలి మఠానికి చెందిన అభినవ హలశ్రీ స్వామీజీ పరారీలో ఉన్నారు.
ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 72 మంది కొత్తముఖాలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. అయితే టికెట్లు ఇప్పిస్తామని చెప్పి.. కొంతమంది నుంచి 5 కోట్ల వరకు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
టికెట్ ఇప్పిస్తామని నమ్మబలికి తన వద్దనుంచి రూ.5 కోట్లు తీసుకున్నట్టు పారిశ్రామికవేత్త గోవిందబాబు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు చైత్ర… గోవిందబాబును స్వామీజీ వద్దకు తీసుకెళ్లగా ఆయన తనకు ప్రధాని నరేంద్రమోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికారు. దీంతో ఆ పారిశ్రామికవేత్త స్వామీజీకి రూ.1.5 కోట్లు అందజేశారు. ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని చైత్రను కోరగా… ‘నీ ఆదాయ వనరులకు సంబంధించిన వివరాలను దర్యాప్తు సంస్థలకు అందిస్తాను’ అని ఆమె గోవిందబాబును బెదింరించారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.