ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా వ్యవహారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ విచారణను కోరిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
అనిల్ దేశ్ముఖ్ రాజీనామా అనంతరం ప్రభుత్వాన్ని నడిపే నైతిక బాధ్యతను ఉద్ధవ్ ఠాక్రే కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఠాక్రే కుట్రపూరితంగా మౌనం దాల్చారని ఆరోపించారు. కాగా ముంబై మాజీ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల కేసులో.. హోంమంత్రి దేశ్ముఖ్పై 15 రోజుల్లోగా సీబీఐ విచారణ పూర్తి చేయాలని ఇవాళ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.