చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం 27 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను ప్రకటించింది. కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పీఎల్సీ, ఎస్ఏడీ-సంయుక్త్లతో కలిసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ బరిలో దిగింది. కూటమిలో పీఎల్సీ 37 స్ధానాల నుంచి పోటీ చేస్తుండగా, ఎస్ఏడీ-సంయుక్త్ 15 స్ధానాల్లో బీజేపీ 65 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేస్తోంది.
బీజేపీ ప్రకటించిన 27 అసెంబ్లీ స్ధానాల అభ్యర్ధుల జాబితాలో సీమా కుమారి, పర్మీందర్ సింగ్ గిల్, ఫతే సింగ్ బజ్వా, కుల్దీప్ సింగ్ కహ్లోన్, ప్రదీప్ సింగ్ భుల్లర్, కుమార్ అమిత్ వాల్మీకి, బల్వీందర్ కౌర్, విజయ్ సంప్లా, సురీందర్ మహీ, శరబ్జిత్ సింగ్, పర్మీందర్ శర్మ, ఇక్బాల్ సింగ్లకు చోటు దక్కింది. మరోవైపు ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇక పంజాబ్ పోరులో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రజాకర్షక పధకాలతో గద్దెనెక్కాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక అకాలీదళ్తో పాటు బీజేపీ కూటమి సైతం సత్తా చాటాలని ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.