బెంగళూరు, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నేషనల్ డెస్క్: కన్నడ నాట ‘40 శాతం కమీషన్ బీజేపీ సర్కారుకు’ ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవినీతిని, మత రాజకీయాలను సహించేది లేదని తిరుగులేని తీర్పిచ్చారు. ప్రధాని మోదీ వాక్చాతుర్యం తమను ఆకట్టుకోలేవని స్పష్టం చేశారు. శనివారం వెలువడిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కేవలం 65 స్థానాలకే పరిమితమై చతికిలపడింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 39 సీట్లు కోల్పోయింది. దీంతో దక్షిణాదిలో ప్రవేశానికి మహా ద్వారంగా భావిస్తున్న కర్ణాటకలో ఇప్పుడు ఆ పార్టీకి తలుపులు మూసుకుపోయాయి. తమని గెలిపించకపోతే రాష్ర్టాభివృద్ధికి నిధులు విడుదల చేయమన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా బెదిరింపులను ఓటర్లు పట్టించుకోకపోలేదు. అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులు, గ్రామీణులు వేసవి కాలంలో ఓటుతో కొట్టిన దెబ్బకు కమలానికి వడదెబ్బ తగిలినట్లయింది! ఏకంగా 12 మంది మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల్లో ఓడిపోవడంతో కమలానికి కర్ణాటకలో ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
ఓటమికి కారణాలెన్నో
కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ అభివృద్ధిని విస్మరించడంతో ఓటమిని కొని తెచ్చుకున్నది. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అవినీతి ఆరోపణలు, హామీలు నెరవేర్చకపోవడం, రిజర్వేషన్లను రాజకీయానికి వాడుకోవడం తదితర అంశాలు బీజేపీని ఇంటికి సాగనంపాయి.
అవినీతి ఆరోపణల వెల్లువ
40 శాతం కమీషన్ సర్కారుగా బీజేపీ ప్రభుత్వంపై ఆది నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ విషయమై ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాయడం సంచలనం సృష్టించింది. కొందరు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల అవినీతి, వేధింపుల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవడం, దీని కారణంగా ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడం, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పను అవినీతి కేసులో అరెస్ట్ చేయడం కూడా బీజేపీ పరాభవానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
రిజర్వేషన్ల దెబ్బ
హిందువుల ఓట్లే తమను గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకొన్న బొమ్మై సర్కారు, ఎన్నికలకు ముందు ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించింది. మరోవైపు ఈబీసీ క్యాటగిరీలోకి ముస్లింలను చేర్చడాన్ని అప్పటికే ఆ క్యాటగిరీలో ఉన్న కొన్ని కులాలు జీర్ణించుకోలేకపోయాయి. ఇంకోవైపు రిజర్వేషన్ల మార్పుల వల్ల నష్టపోతామని ఎస్సీలో పెద్ద వర్గమైన బంజారాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ విధంగా బీజేపీ ఓటు బ్యాంకుకు రిజర్వేషన్లు భారీగా గండి కొట్టాయి.
ద్రవ్యోల్బణం.. నిరుద్యోగం.. ప్రభుత్వ వ్యతిరేకత
మౌలిక సదుపాయాలు సరిగా కల్పించలేని బీజేపీ సర్కారుపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ఓట్ల రూపంలో దెబ్బ తీసింది. కొన్నేండ్లుగా పెరుగుతున్న వంట గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు మధ్య తరగతి, పేద ఓట్లర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ తమకు కనీస సంఖ్యలో కూడా ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు, యువకులు బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పారు.
‘ఆపరేషన్ లోటస్’ నచ్చలేదు
2019 జులైలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. కమల నాథులకు తగిన బలం లేకున్నా అన్యాయంగా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేలా చేశారని కన్నడ ప్రజలు భావించారు. కమలం పార్టీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలకు ఈ సారి ఎన్నికల్లో ఓటర్లు గుణపాఠమే చెప్పారు.
బీఎల్ సంతోష్ సంక్షోభం
బీజేపీ ఓటమికి ఆ పార్టీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి, కర్ణాటకకే చెందిన బీఎల్ సంతోష్ సృష్టించిన సంక్షోభం కూడా కారణమని కమలనాథులు వాపోతున్నారు. తన మాటే నెగ్గాలని ఆయన చేపట్టిన మార్పులు, చేర్పులకు బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. యెడియూరప్పను సీఎం గద్దె నుంచి దించటం, తన అనూయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం పార్టీ పుట్టి ముంచిందని కమలం శ్రేణులు చింతిస్తున్నాయి.
బొమ్మై రాజీనామా
ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ థావర్చందర్ గెహ్లాట్కు అందజేశారు. బొమ్మై రాజీనామా ఆమోదం పొందిందని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి.