భువనేశ్వర్: ఒడిశాలో (Odisha) పాత మిత్రులు ఒక్కటయ్యారు. 11 సంవత్సరాల తర్వాత అధికార బిజూ జనతాదళ్ (BJD), బీజేపీ మళ్లీ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ 13 స్థానాల్లో, బీజేపీ (BJP) 8 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈమేరకు ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం 9 ఎంపీ సీట్లు, 55 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో 2009 తర్వాత ఇరు పార్టీలు కలిసి పోటీచేయడం ఇదే తొలిసారి.
బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. 11 ఏండ్లపాటు కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి బ్రేక్ పడింది. 2009 ఎన్నికల సందర్భంగా 63 అసెంబ్లీ స్థానాలకు బదులుగా 40 చోట్ల, తొమ్మిది ఎంపీ సీట్లకు బదులు ఆరు స్థానాలే ఇస్తామని కమలం పార్టీకి బీజేడీ ప్రతిపాదించింది. అందుకు ఒప్పుకోని బీజేపీ అధిష్ఠానం ఒటరిగా పోటీచేసింది. దీంతో ఎన్డీఏ నుంచి బీజేడీ వెలుపలికి వచ్చింది. అయినప్పటికీ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు తెలుపుతూ వస్తున్నది.