పాట్నా, జూలై 30: ఎన్డీయే అధికారంలో ఉన్న బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి విద్యార్థులు చుక్కలు చూపించారు. శనివారం పాట్నా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన జేపీ నడ్డాను విద్యార్థులు అడ్డుకొని, వెనుకకు తరిమినంత పని చేశారు. ఆల్ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఆధ్వర్యంలో వందలమంది విద్యార్థులు నడ్డాకు అతి సమీపానికి దూసుకెళ్లారు. కొందరు మహిళా విద్యార్థులు ఆయన కాన్వాయ్కు అడ్డుపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవటం బీహార్లో బీజేపీ, జేడీయూ ప్రభుత్వంలో లుకలుకలను మరోసారి బయటపెట్టింది. కొంతకాలంగా సీఎం నితీశ్కుమార్ తన మిత్రపక్షం బీజేపీతో అంటీముట్టనట్టు వ్యహరిస్తున్నారు. జేపీ నడ్డా చదువుకొన్న పాట్నా యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇవ్వాలని ఇటీవలే ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాజాగా శనివారం అదే డిమాండ్తో విద్యార్థులు నడ్డాను అడ్డుకొన్నారు.