Haryana | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి, హర్యానా నేత బీరేంద్ర సింగ్ (78) షాక్ ఇచ్చారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తాను, తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే ప్రేమలత సింగ్ బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాము మంగళవారం కాంగ్రెస్లో చేరబోతున్నామని చెప్పారు. తాను ఇచ్చిన సలహాలను బీజేపీ పెద్దలు పట్టించుకోలేదన్నారు. జేజేపీతో సంబంధాలను తెంచుకోవాలని కొన్ని నెలల క్రితం సలహా ఇచ్చానని, దానిని కూడా పార్టీ పెద్దలు పెడచెవిన పెట్టారని అన్నారు. సుమారు ఓ నెల క్రితం వీరి కుమారుడు బ్రిజేంద్ర కాంగ్రెస్లో చేరారు. బీరేంద్ర సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడాతో సమావేశమయ్యారు.