CM Biren Singh | ఇంఫాల్: రెండు నెలలుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారని, సాయంత్రం గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారంటూ ఉదయం నుంచి లీకులతో పెద్ద హైడ్రామానే నడిచింది. రాజీనామాకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో బీజేపీ కార్యకర్తలు పెద్దయెత్తున ఇంఫాల్లోని సీఎం బీరేన్ నివాసం వద్దకు చేరుకొని.. రాజీనామా చేయొద్దంటూ నినాదాలు చేయడం, రాజ్భవన్కు వెళ్లాల్సిన సీఎం కాన్వాయ్ను అడ్డుకోవడం, రోడ్డుపై బైఠాయించడం వంటివి చేయడం ద్వారా భారీ హడావుడి జరిగింది. కాగా, సీఎం బీరేన్తో సమావేశమైన కొంతమంది నేతలు.. ‘సీఎం రాజీనామా చేయడం లేదు. మాకు హామీ ఇచ్చారు’ అని ప్రకటించి ఈ హైడ్రామాకు తెరదించారు. ఈ ప్రకటన తర్వాత సీఎం మద్దతుదారులు అక్కడి నుంచి జారుకొన్నారు. గవర్నర్కు సమర్పించేందుకు సీఎం తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేశారని, మద్దతుదారుల ఒత్తిడితో దాన్ని చింపేశారని అనధికారిక వర్గాలు వెల్లడించాయి.
కాంగ్పోక్పి జిల్లాలోని హరోథెల్లో గురువారం భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తులకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. మరో ఐదుగురికి గాయాలైనట్టు తెలుస్తున్నది. మృతుల బంధువులు మృతదేహాలతో సీఎం బీరేన్ ఇంటికి ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో.. వారు అక్కడే రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జి చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేను కలిశారు. అనంతరం రాజ్భవన్ బయట మీడియాతో మాట్లాడుతూ హింస పరిష్కారం కాదని, ప్రజలందరూ శాంతి పాటించాలని పిలుపునిచ్చారు.