కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి గట్టి షాక్ తగిలింది. కీలక నేత బినోయ్ తమాంగ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో టీఎంసీ మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా ప్రజాతంత్రక్ మోర్చా (బీజీపీఎం) ప్రజాస్వామ్య విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో ఓట్లేసిన ప్రజలను అవమానించేలా అక్రమంగా అధికార మార్పిడి జరిగిందని ఆయన విమర్శించారు.
డార్జిలింగ్ మున్సిపాలిటీలో అజయ్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని అమ్రో పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే తృణమూల్ మిత్రపక్షం, అనిత్ థాపా నేతృత్వంలోని బీజీపీఎం ఇవాళ అమ్రో పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపాలిటీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విధమైన అధికార మార్పిడిపై బినోయ్ తమాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజీపీఎం తీరుకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు బినోయ్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచి తాను ఒంటరి వాడినని చెప్పారు. డార్జిలింగ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తనపై ఎప్పుడు ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.