బెంగళూరు, నవంబర్ 15: దేశంలోని స్కూల్ టీచర్లకు శిక్షణ కోసం ఏటా బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) ఖర్చు చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఇన్ఫోసిస్ సహవ్యస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు. ఇందుకోసం ఇండియాసహా ప్రపంచంలో ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో విజయవంతమైన రిటైర్డ్ టీచర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. టీచర్లు, రిసెర్చర్లను గౌరవించడంతోపాటు వారికి మెరుగైన వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. యువతకు వారు రోల్మాడల్స్ కాబట్టి వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇందుకోసమే తాము 2009లో ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)ని పరుగులు పెట్టించాలంటే ‘స్టెమ్’ రంగంలో రిటైర్ అయిన 10 వేలమందితో 2,500 ‘ట్రైన్ ద టీచర్’ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు.