తిరువనంతపురం: వర్సిటీల చాన్స్లర్ పదవి నుంచి గవర్నర్ను తొలగించే బిల్లును కేరళ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి వ్యతిరేకించింది. చాన్స్లర్కు ఉండాల్సిన అర్హతలేమిటో బిల్లులో పొందుపర్చలేదని విమర్శించింది. అయితే తొలుత ఈ బిల్లును అసెంబ్లీ కమిటీ పరిశీలనకు పంపనున్నారు. కమిటీ పరిశీలన అనంతరం బిల్లు తిరిగి సభకు చేరుకుంటుంది. అప్పుడు అవసరమైతే ఓటింగ్ నిర్వహించి బిల్లును ఆమోదిస్తారు.
తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కేరళ సర్కారు, గవర్నర్ మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వివిధ అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్ మోకాలడ్డుతున్నదని విజయన్ సర్కారు ఆరోపిస్తున్నది. వీసీల నియామకాల విషయంలోనూ ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య వివాదం నడుస్తున్నది. పలు వర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశించడం వివాదాన్ని మరింత పెంచింది.