Bilkis Bano | గాంధీనగర్, జనవరి 10: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే.. 9 మంది దోషులు కనిపించకుండా పోయారని జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. గత ఆదివారం వరకు వీరంతా ఊళ్లోనే కన్పించారని, దోషులంతా లొంగిపోవాలని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఈనెల 8న కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి దోషి ఇంటివద్ద పోలీస్ కానిస్టేబుల్ను కాపలాగా ఉంచినప్పటికీ, దోషులు కనిపించకుండా పోవటం అనుమానాలకు తావిస్తున్నది. 11మంది దోషుల్లో 9 మంది అజ్ఞాతంలోకి వెళ్లటం సంచలనం రేపుతున్నది. వారం క్రితమే తమ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ తండ్రి మీడియాకు తెలిపారు. దోషుల్లో మరొకడు రాధేశ్యామ్ గత 15 నెలలుగా ఇంటికి రావటం లేదని అతడి తండ్రి భగవాన్ దాస్ చెప్పారు. కానీ.. స్థానికులు మాత్రం ఈ మాటల్ని తోసిపుచ్చారు. గోవింద్నాయ్, రాధేశ్యామ్ ఇద్దరూ జనవరి 7 వరకు ఊళ్లోనే ఉన్నారని చెప్పారు.
దోషులంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు భావించలేమని దాహోద్ జిల్లా ఎస్పీ అన్నారు. కొందరు బంధువుల ఇండ్లకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. తమకు సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందలేదన్నారు. ఈ కేసులో దోషులంతా దాహాద్ జిల్లాలోని రాంధిక్పుర్, సింగ్వాద్ గ్రామాలకు చెందినవారు. గోద్రా అల్లర్ల నాటి వరకు బిల్కిస్ బానో కుటుంబం రాంధిక్పుర్లో నివసించేది. 2002 గుజరాత్ మత ఘర్షణల్లో దుండగులు బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి, కుటుంబ సభ్యులపై హత్యాకాండకు పాల్పడ్డారు. ఈ కేసులో జీవిత ఖైదు పడిన దోషులకు 2022లో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.