BJP | చెన్నై: బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నకిలీ వార్తలను, వీడియోలను చూసి భయపడిన ఆ రాష్ట్ర కార్మికులు తమిళనాడు వ్యాప్తంగా శనివారం విధులకు దూరంగా ఉన్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు, నిర్మాణ సంస్థల యజమానులు తమ దగ్గర పని చేస్తున్న కార్మికులను కలిసి వారి రక్షణ బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే కొందరు కార్మికులు హోలీ పండుగ కోసం సొంతూళ్లకు వెళుతున్నామని, పండగ తర్వాత తిరిగి వస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు బీహారీ కార్మికులతో చర్చలు జరిపారు. చెన్నై చేరుకున్న బీహార్ శాసనసభ కమిటీ తమ రాష్ట్ర కార్మికుల రక్షణకు తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.
తమిళనాడులో బీహార్కు చెందిన వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ అసత్య ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలైపై సైబర్ క్రైమ్ డివిజన్ పోలీసులు హింసను రెచ్చగొట్టే కేసు రిజిస్టర్ చేశారు.