పాట్నా: రక్షాబంధన్ ( Raksha Bandhan ) రోజున పాములకు రాఖీ కట్టాలనుకున్న ఓ వ్యక్తి.. ఆ పాము ( Snake ) కాటుకే బలయ్యాడు. ఈ ఘటన బీహార్లోని సరన్ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజైంది. రాఖీ పండుగ రోజున 25 ఏళ్ల మన్మోహన్ పాములకు రాఖీ కట్టాలనుకున్నాడు. వృత్తిరీత్యా మన్మోహన్ పాములు పట్టేవాడే. అయితే ఆ రోజున రెండు పాములను ఇంటికి తెచ్చిన అతను.. తన సోదరీమణులతో వాటికి రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. రాఖీ కట్టడానికి ముందు ఆ సర్పాలకు తిలకం దిద్దాలనుకున్నాడు. పాము తోకలను పట్టుకున్న అతను ఆ సమయంలో తిలకం అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతని చేతుల్లో ఉన్న ఓ పాము మన్మోహన్ ఎడమ కాలి బొటనవేలను కొరికేసింది. పాముకు రాఖీ కట్టే వేడుకను చూసేందుకు వచ్చిన జనం వీడియోలను తీశారు. ఈ ఘటనతో ఆ గ్రామస్తులు షాక్ తిన్నారు.
పాము కాటుతో స్పృహ తప్పిన మన్మోహన్ను సరన్ జిల్లాలోని ఎక్మా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడ యాంటీ వినమ్ ఇంజెక్షన్ లేకపోవడంతో మరో ఆస్పిటల్కు తరలించారు. చాప్రాలోని సదర్ హాస్పిటల్కు తీసుకువెళ్లే సరికి అతను మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.