పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని సరన్లో ఈ విషాద సంఘటన జరిగింది. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే 25 ఏండ్ల మన్మోహన్ తన సోదరీలతో పాములకు రాఖీలు కట్టించేందు ప్రయత్నించాడు. దీని కోసం రెండు పాములను తోకలతో పట్టుకున్నాడు. ఇంతలో ఒక పాము మెల్లగా పాకుతూ ఏమరుపాటుగా ఉన్న అతడి పాదం వేలిపై కాటు వేసింది. దీంతో కూర్చొన్న మన్మోహన్ వెంటనే పైకి లేచాడు. అనంతరం అతడు ఆసుపత్రిపాలై మరణించాడు.
కాగా, ప్రకృతి ప్రేమికుడైన మన్మోహన్, గత పదేండ్లుగా ఇండ్లలోకి ప్రవేశించే పాములను పట్టి వాటిని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టేవాడు. గాయపడిన పాములకు చికిత్స కూడా చేసేవాడు. పాము కాటుకు గురైన వందలాది స్థానికులు, పరిసర గ్రామస్తులకు చికిత్స అందించాడు. అయితే, అలాంటి వ్యక్తి పాము కాటు వల్ల చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మరోవైపు, మన్మోహన్ పాములకు రాఖీలు కట్టడాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే ఒక పాము అతడ్ని కాటు వేయడాన్ని చూసి షాకయ్యారు. అనంతరం చికిత్స పొందుతూ అతడు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొన్నది. కాగా, తమ మొబైల్స్లో కొందరు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.