పాట్నా : దేశవ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ సాగుతున్నది. టీకాతో దుష్ప్రభావాలు ఉంటాయనే భయంతో కొందరు తీసుకునేందుకు జంకుతుండగా.. ఓ వృద్ధుడు ఏకంగా 11 సార్లు టీకా తీసుకున్న ఘటన బిహార్లో వెలుగులోకి వచ్చింది. మాధేపురాకు పురైని బ్లాక్లోని ఔరాహి గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్ మండల్ తపాలాశాఖ మాజీ ఉద్యోగి. ఇప్పటి వరకు 11 కొవిడ్ టీకాలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే, కొవిడ్ టీకా తీసుకోవడంతో అద్భుతంగా తన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని చెప్పాడు. టీకా తీసుకున్న ప్రతిసారీ కీళ్ల నొప్పులు తగ్గుతూ వచ్చాయని తెలిపాడు.
‘నేను నడవలేని స్థితిలో జనవరి (2021)లో టీకా తొలి డోసు తీసుకున్నాను. రెండో మోతాదు అనంతరం ఆరోగ్యం మెరుగుపడింది. ఆ తర్వాత మరో టీకా తీసుకోవాలని నిర్ణయించున్నాను. వ్యాక్సిన్ కోసం ఆధార్కార్డును నాలుగుసార్లు, ఓటర్ ఐడీకార్డును రెండుసార్లు అందజేశాను. గతేడాది ఫిబ్రవరిలో రెండో డోసు వేశారు’ అని చెప్పాడు. ఈ నెల 4న 12డోస్ కోసం టీకా కేంద్రానికి వెళితే వెయలేదని తెలిపాడు. అయితే, 11సార్లు వ్యాక్సిన్ తీసుకున్నా తనకు ఎలాంటి దుష్ప్రభావాలు కలుగలేదని మండల్ చెప్పాడు. ‘వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంత మంది చనిపోతున్నారనే పుకార్లను తప్పని రుజువు చేసేందుకు ప్రయత్నించాను’ అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం తాను సాధారణంగా నడుస్తున్నానని, పల్స్ రేటు 72 ఉందని చెప్పారు. అయితే, ఈ ఘటనపై బిహార్ ఆరోగ్యశాఖ మాధేపుర జిల్లా అధికార యంత్రాంగం నుంచి నివేదిక కోరింది. ఈ సందర్భంగా సివిల్ సర్జన్ డాక్టర్ ఏపీ షాహి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ టీకాల విషయంపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కారణంగా జరిగిందా? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పురైని బ్లాక్లో టీకాలు పొందినట్లు చూపించే సర్టిఫికెట్లను అధికారులు ముందు సమర్పించినట్లు మండల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు అర్వాల్, పాట్నా జిల్లాల్లో అనేక మంది వీవీఐపీల పేర్లు టీకాల లిస్ట్లో కనిపించిన విషయం తెలిసిందే.