పాట్నా: నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన నేత దాడిచేశాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్పై (Constable) పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించిన ఘటన బీహార్లోని (Bihar) సహర్సాలో (Saharsa) జరిగింది. పట్టణంలో పోలీసులు బుధవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు యువకులు తనిఖీలను తప్పించుకుని రోడ్డుపై ఏర్పాటుచేసిన బారికేడ్లను ధ్వంసం చేసి అక్కడినుంచి పరారయ్యారు. వారికోసం గాలిస్తున్న పోలీసులకు.. అధికార పార్టీ జేడీయూకి (JD-U) చెందిన చున్నా ముఖియా (Chunna Mukhiya) నివాసంలో దాక్కున్నారని సమాచారం అందింది.
దీంతో ఆ యువకులను అరెస్టు చేయడానికి ముఖియా ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే అడ్డుకున్న ముఖియా, అతని అనుచరులు వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా సమీపంలో పెట్రోల్ బంక్కు వెళ్లిన ముఖియా.. ఓ బకెట్ నిండా పెట్రోల్ (Petrol) తీసుకొచ్చారు. దానిని పోలీసు బృందంలోని ఓ మహిళా కానిస్టేబుల్పై (Woman Constable) పోశాడు. అనంతరం అగ్గిపెట్టె తెచ్చి కానిస్టేబుల్ను అంటించాలని తన భార్యతో చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముఖియాతోపాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తుకు ఆటంకం కలిగించారని కేసునమోదుచేశారు. కాగా, ఆ సమయంలో మఖియా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు.